8, జూన్ 2011, బుధవారం

వాతాపి గణపతి ఎవరు?

వాతాపి గణపతి 
సంగీత జ్ఞానం ఉన్నా లేకున్నా, శ్రీ ఘంటసాల గారు పాడిన వాతాపి గణపతిం భజే" వినని తెలుగు వారుండరు. కర్ణాటక సంగీతం నేర్చుకునే విద్యార్థులు ఈ కృతిని తప్పకుండా నేర్చుకుంటారు. దీనిని కట్టిన రాగం హంస ధ్వని. ఈ కృతి రచయిత సంగీత త్రయం లో ఒకరైన శ్రీ ముత్తు స్వామి దీక్షితార్ గారు. 'హంసధ్వని' రాగాన్ని సృజియించింది ముత్తుస్వామి తండ్రిగారైన రామస్వామి దీక్షితార్ గారు. గణేశుని బీజాక్షరం "గం" అవడం వలన ఈ కృతిని దీక్షితార్ గారు 'గాంధారం' తో మొదలు పెట్టారు.
  
      వాగ్గేయకారులు తరచూ తమ రచనలలో తమ సంతకాన్ని సాహిత్యంలో భాగంగా ప్రస్తావిస్తారు. శ్రీ త్యాగరాజస్వామి వారు "త్యాగరాజనుత" అని కృతి చరమార్ధం లో వ్రాస్తారు. అలాగే శ్రీ దీక్షితారు గారు "గురుగుహ" అని సంతకం చేస్తారు.  ఉదాహరణకు ఈ కృతిలో "హరాది గురుగుహ తోషిత బింబం" అని రచించారు. అయితే అన్నమయ్య నిస్వార్ధంగా తన పేరు వాడుకోకుండా వెంకటేశ్వరునే ముద్రగా వాడాడు.  ఇకపోతే "వాతాపి గణపతిం భజే" లో వాతాపి అంటే అర్థం ఏమిటి?

      'వాతాపి' అనేది ఊరి పేరు. దీనినే ప్రస్తుతం 'బాదామి' అని అంటారు. ఈ బాదామి కర్నాటక రాష్ట్రం లోని బాగల్ కోట జిల్లా లో వుంది.  ఇది 6-8 శతాబ్దాల మధ్య బాదామి చాళుక్యుల రాజధాని.  అయితే దాని చుట్టూ ఉండే కొండలు బాదం రంగు (గోధుమ రంగు) లో ఉండటం వలనేమో 'వాతాపి' క్రమేపీ 'బాదామి' అయింది.  దీని దగ్గరలో ఉన్న సరస్సును 'అగస్త్య సరస్సు' అంటారు.  అలనాటి రామాయణ సమయంలో బాదామికి, అగస్త్యునికి సంబంధించిన కథ ఒకటి ఉంది. ఈ నగరం రాజధానిగా ఇల్వలుడు, వాతాపి అనే ఇద్దరు రాక్షసులు పాలించేవారు.  వాళ్ళు బ్రాహ్మణ ద్వేషులు. దారిన పోయే యాత్రీకులను తమ మాయతో చంపి భక్షించేవారు. ఎలా అంటే యాత్రికులు వచ్చే సమయం చూసి ఇల్వలుడు తన తమ్ముడైన వాతాపిని మేకగా మార్చి, ఆ మేకను చంపి మేక మాంసం యాత్రికులకు పెట్టేవాడు. వారు భుజించిన కొద్ది సేపటికి ఇల్వలుడు తన తమ్ముడిని "వాతాపీ! రా బయటకు" అని పిలిచేవాడు. అప్పుడు యాత్రీకుల పొట్టలో చేరిన వాతాపి వాళ్ళ పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేవాడు. దానితో ఆ యాత్రీకులు కాస్త విగత జీవులయ్యేవారు. అపుడు ఆ అన్నదమ్ములిద్దరూ చక్కగా ఆరగించేవారు అతిథులను. అయితే కొంత కాలానికి ఆ త్రోవంట అగస్త్య మహాముని వచ్చేరు. అగస్త్యుడు కుండ (కుంభం) లో జన్మించాడు. అందుకే అతనిని కుంభ సంభవుడు అంటారు.  ఈ దనుజులు ఇద్దరూ అగస్త్యున్ని స్నానం చేసి రమ్మని, భోజనం సిద్ధం చేస్తామని చెప్పారు. అగస్త్యుడు సర్వజ్ఞుడు. వీళ్ళకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. స్నానం చేసి వచ్చిన అగస్త్యునికి ఇల్వలుడు ఆహారంతో మేక మాంసం కూడా వడ్డించాడు. అగస్త్యుడు ఆ ఆహారాన్ని భుజించి వెంటనే తన పొట్ట మీద చేయి పెట్టి "వాతాపి జీర్ణం" అని త్రేన్చాడు.  అంతే!  ఆయన కడుపులోని వాతాపి జీర్ణం అయిపోయాడు. అయితే ఇల్వలుడు ఎంత పిలిచినా మరి వాతాపి జాడ లేదు. ఆ ఊరే వాతాపి. అగస్త్యుడు ఇల్వలుడ్ని కూడా అంతం చేస్తాడు.  బాదామి చుట్టూ ప్రక్కల కొండ గుహలలో చాల ఆలయాలు ఉన్నాయి. అందులో శివ, విష్ణు, బుద్ధ ఆలయాలు ప్రసిద్ధి చెందినవి.  పల్లవ రాజులు చాళుక్యుల పై దండెత్తినపుడు వాతాపి లోని గణపతి విగ్రహాన్ని బాదామి నుండి తెచ్చి తిరువారూర్ కోవెలలో ప్రతిష్టించారని చారిత్రిక ఆధారం.  ఆ గణపతే శ్రీ దీక్షితార్ గారు ప్రస్తావించిన 'వాతాపి గణపతి'.

      మన పెద్దవాళ్ళు ముఖ్యంగా తల్లులు పిల్లలకు బువ్వ పెట్టి వాళ్ళ కడుపు మీద చేయి వేసి "వాతాపి జీర్ణం" అని అంటారు. ఎందుకంటే పిల్లలు ఎటువంటి అజీర్ణానికి లోను కాకూడదని. 

2 కామెంట్‌లు:

  1. మంచి సమాచారం ఇచ్చారు. పౌరాణికం, చరిత్ర రెండిటిని మిళితం చేసి చెప్పారు... బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. కమల్ గారు, ధన్యవాదాలు. మీకు ఈ వ్యాసం నచ్చినందుకు సంతోషం. నిజానికి "వాతాపి గణపతిం భజే" కృతి తాలూకు తాత్పర్యం వ్రాయాలని మొదలుపెట్టాను. అయితే ముందుగా ఈ కీర్తనకు సంబంధించిన విషయం ముందు ప్రవేశపెడితే బాగుండుననిపించింది. అయితే సేకరించిన విషయం ఆసక్తికరంగా ఉండి పెద్దదవడం వలన, మరొక పోష్టులో ఈ కృతి యొక్క అర్ధం వివరిస్తాను.

    రిప్లయితొలగించండి

Blog Junctions